పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలి : బ్రిటన్ ఎంపీ బ్లాక్మన్
రాజస్తాన్ లో జైపూర్లో సోమవారంనాడు జరిగిన హై-టీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్తో సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని తాను మూడు దశాబ్దాల క్రితమే చెప్పానని, ఆ పని 1992లో కశ్మీర్ పండితులు వలసల కన్నా ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1990 మొదట్లో కశ్మీర్ పండిట్లు వలసలు వెళ్తున్నప్పుడే తన వైఖరిని స్పష్టం చేసినట్టు చెప్పారు. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370వ అధికరణను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయడానికి చాలాకాలం ముందే 1992లో నేను ఈ విషయం ప్రస్తావించాను. కశ్మీర్ పండిట్లకు తీవ్రం అన్యాయం జరుగుతోందంటూ యూకేలో ఒక సమావేశం కూడా నిర్వహించాం. మతం, ఇతర కారణాలతో కశ్మీర్ పండిట్లు తమ పూర్వీకుల ఇళ్లు బలవంతంగా వదిలి వెళ్లాల్సి రావడాన్ని ఖండించాం' అని బ్లాక్మన్ తెలిపారు. జమ్మూకశ్మీర్లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలను కూడా తాను అనేకసార్లు సూచించానని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని కూడా బ్లాక్మన్ ఖండించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్లో పరిస్థితులు మొరుగపడటంతో అక్కడ శాంతి నెలకొందని తాము భావించినప్పటికీ పహల్గాం దాడితో ఉగ్రసమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు ప్రపంచదేశాలు బాసటగా నిలబడటం ముఖ్యమని చెప్పారు.
Comments
Post a Comment