దక్షిణ లెబనాన్లోని స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా స్థావరాలను టార్గెట్ చేశాయి. సాజ్, అల్-రయ్హాన్, మౌంట్ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్ అల్-జహ్రాని, హౌమిన్ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. మరోవైపు దీర్ అల్-జహ్రాని-హౌమిన్ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హెజ్బొల్లాకి చెందిన మిసైల్ ప్లాట్ఫారమ్లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ లెబనాన్ గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Post a Comment