నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం చాలా శోచనీయం : జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అన్నారు. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి, తగిన చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా లేదా నోటీసులు జారీ చేయకుండా వారిని అరెస్టు చేయడం చాలా శోచనీయం మరియు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు నేరస్థులు లేదా ఉగ్రవాదులు కాదని జగన్ గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై అనవసరమైన కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలు వారి కుటుంబాలపై తీవ్ర మానసిక గాయాన్ని కలిగిస్తాయని, మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యాంగాన్ని గౌరవించాలని, చట్ట నియమాలను పాటించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీవీలో ప్రసారమైన వివాదాస్పద కథనంపై ఆ ఛానల్ ఇప్పటికే క్షమాపణలు కోరింది. అయినా పోలీసులు ఛానల్ కు చెందిన ఓ మహిళా న్యూస్ ప్రజెంటర్ తో పాటు ముగ్గురు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాత్రం వారు తప్పించుకునేందుకు ప్రయత్నించడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. విచారణకు వస్తామని చెప్పి సెల్ ఫోన్ లు స్విచాఫ్ చేసుకున్నందుకే ఇలా ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు.
Comments
Post a Comment