విశాఖలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి 500 ఎకరాలు : జిఎంఆర్ భాగస్వామ్యంతో అభివృద్ధి ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ఆర్థిక రాజధానిగాను, విశాఖను ఐటీ కారిడార్ గాను, తిరుపతిని స్పోర్ట్స్ సిటీ గాను అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం దగ్గర 500 ఎకరాలలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలతో పాటు కేంద్రం మద్దతుతో విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల ఏర్పాటు పైన దృష్టి సారిస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగానే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఇది రాష్ట్ర విద్యా, ఉపాధి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయం ఉంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో జిఎంఆర్ ప్రతినిధులతో కలిసి ఈ సిటీ ప్రతిపాదన పైన చర్చ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం లోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చేరుకున్న క్రమంలో దీనికి సమీపంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇక్కడ మాన్సాస్ ట్రస్ట్ తో పాటు ప్రభుత్వ ప్రైవేటు భూముల అందుబాటులో ఉన్నాయని వాటిని సన్నద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏవియేషన్ సిటీని ప్రభుత్వం జిఎంఆర్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పైన ఈ నెలలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే జిఎంఆర్ సంస్థ ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని నిర్మించనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే విమానయానం, ఏరోస్పేస్. రక్షణ రంగాల శిక్షణకు దేశంలోనే ఇది ప్రధానకేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, మెరుగైన ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది విమానయాన రంగంలో ఒక కీలక మార్పు తీసుకు వస్తుంది అన్న అంచనా కూడా ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ నెలలో ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
Comments
Post a Comment