శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ రూ.4,500 నుంచి రూ.12,500కు పెంపు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757 మంది ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ప్రస్తుతం ఇస్తున్న రూ.4,500 నుంచి నేరుగా రూ.12,500కు పెంచుతున్నట్లు వేదికపైనే ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల ద్వారా ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సమర్థతకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న పోలీసు యువకులు నిబద్ధతతో ప్రజల భద్రత కోసం పనిచేయాలని పిలుపునిస్తూ, నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం