మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా గుంటూరు కార్పోరేషన్లో 18 గ్రామాలు విలీనం !
గుంటూరు మహా నగరపాలక సంస్థగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇందులో భాగంగా 18 గ్రామాలను విలీనం చేస్తున్నట్లు మేయర్ కోవెలముడి రవీంద్ర తెలిపారు. గుంటూరు మండలంలోని లాల్ పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోక వారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ, పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్ళపాడు, చంద్రపాలెం, వట్టి చెరుకూరు మండలంలోని కొర్నె పాడు, పుల్లడిగుంట, తాడికొండ మండలంలోని లాం గ్రామాల విలీనంతో గుంటూరు మహానగరంగా విస్తరించనున్నది. ఈ గ్రామాల విలీనానికి శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగరపాలక సంస్థ ఆమోదం తెలిపింది. గుంటూరును మహా నగరపాలక సంస్థగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసినట్లు మేయర్ రవీంద్ర చెప్పారు. రాజమండ్రి, కాకినాడ తిరుపతి, విశాఖపట్నం నగరాలకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు.
Comments
Post a Comment