ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ?
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన కారు పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ మాడ్యూల్లో కీలక సభ్యుడిగా ఉన్న డాక్టర్ మొహమ్మద్ ఉమర్ పనే అయి ఉండొచ్చనే అనుమానాలు బలపడ్డాయి. ఈ దాడిని ఆత్మహుతి తరహా ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ మాడ్యూల్లో ప్రధాన నిందితుడైన తన సహచరుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ కావడంతో డాక్టర్ ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని తెలుస్తోంది. పోలీసులకు లొంగిపోవడం కంటే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఉమర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో పేలుడు పదార్థాలు నింపిన హ్యుందాయ్ ఐ20 కారును ఉమర్ ఉద్దేశపూర్వకంగానే పేల్చివేసినట్లు సమాచారం. ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 9 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఐ20 కారులోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి కొన్ని గంటల ముందు కారులో ఉమర్ ఉన్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. పేలుడు సంభవించినప్పుడు కారులో ఉన్న ఏకైక వ్యక్తి అతనే అని సమాచారం. ఉమర్, మరో ఇద్దరితో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ కావడంతో తమ మాడ్యూల్ రహస్యం బయటపడిందని భావించిన ఉమర్, అరెస్ట్కు భయపడి ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి పూర్తిగా కాలిపోయిన స్థితిలో కారులో లభించిన మృతదేహం డాక్టర్ ఉమర్దేనా కాదా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు. డాక్టర్ ఉమర్ గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రర్ ఫైనాన్సింగ్, ఆయుధాల స్మగ్లింగ్ కేసుల్లో అతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.
Comments
Post a Comment