పీపీపీ విధానం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ దక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసమే మెడికల్ కళాశాలలు ప్రారంభించాం. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామని బొత్స స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు, ఆర్థిక సంస్థల సహకారంతో పనులు ప్రారంభించామని, తమ ప్రభుత్వ హయాంలోనే ఐదు కళాశాలలు పూర్తి అయ్యి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలకు మేలు చేస్తుందనే భయంతోనే పనులు ఆపివేసినట్టు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. జగన్కు పేరు వస్తుందనే అసూయతో ప్రైవేటీకరణకు రెడీ అయ్యారు అన్నారు. పీపీపీ విధానం వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. పీపీపీ మోడల్పై పాట పాడుతున్నా, అసలు నియంత్రణ ప్రభుత్వం చేతులకే ఉంటుందంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. మీ దగ్గర డబ్బు ఉంది.. అందుకే పేదలకు చదువు అక్కర్లేదా? ఇది ధర్మమా? అని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీపై తీవ్ర ఆక్షేపణ చేస్తూ తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఇవ్వడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. "ప్రైవేటు లక్ష్యం లాభం, ప్రజలు కాదు".. ప్రభుత్వ వైద్య సేవలు ప్రైవేటుకు అప్పగిస్తే పేదలకు చికిత్స మరింత దూరమవుతుందని, గతంలో వేల కోట్లు ఖర్చు చేసిన ఆరోగ్యశ్రీని ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా కాదు, ప్రజల కోసం పోరాటం. ఇప్పటికే 80 నుండి 90 లక్షల సంతకాలు పూర్తయ్యాయని, కోటి సంతకాలు సేకరించి త్వరలో వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు అందజేస్తామని చెప్పారు.
Comments
Post a Comment