రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం పార్లమెంట్ను నియంత్రించాలని చూస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అఖిలపక్ష సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ఈ సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు 2025, ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఈ స్వల్పకాలిక సమావేశాలు.. శాసనపరమైన ఆశయాలు, రాజకీయ ఘర్షణల మధ్య ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్ సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జైరామ్ రమేష్, గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా వంటి నేతలు హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణలకు సంబంధించిన వాటిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశ విదేశాంగ విధానం ఇతర దేశాల ప్రభావంతో రూపొందించబడుతోందనే ఆందోళనలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఆరోగ్య భద్రతపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Post a Comment