ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సంస్థ చేనేత సాంకేతికతలలో అధునాతన శిక్షణను అందిస్తుంది. దాంతో పాటు ఆధునిక సంప్రదాయ కళల సంరక్షణను కాపాడుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, వారి జీవనోపాధికి ప్రభుత్వం అందించే సహకారం గురించి సీఎం మాట్లాడారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి భరోసా ఇవ్వడం ద్వారా నేత కార్మికులు మరియు చేతివృత్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను కొనియాడారు. కొత్తగా ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ చేనేత కమ్యూనిటీని బలోపేతం చేయడంలో మరియు రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చేనేత నైపుణ్యంలో శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం ఆరు ప్రాంతాల్లో మాత్రమే ఐఐహెచ్టీలు ఉన్నాయని. ఈ సంస్థ ఏర్పాటుతో ఏటా 60 మంది విద్యార్థులకు శిక్షణ సహకారం అందుతుందన్నారు. శిక్షణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చేనేత, టెక్స్టైల్స్లో డిప్లొమా సర్టిఫికేట్ లు అందజేస్తామని చెప్పారు. నాంపల్లిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు.
Comments
Post a Comment