అన్ని రైళ్లలో 'కవచ్' ఏర్పాటు : అశ్వినీ వైష్ణవ్
రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ఏటీపీ) 'కవచ్' ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం లోక్సభ సమావేశంలో వెల్లడించారు. కవచ్ ఏర్పాటుకు సర్కార్ ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయంలో రైల్వే వ్యవస్థలోని లోపాలను ప్రస్తావించారు. ''రైల్వేలు దేశానికి జీవనాధారం. ఆర్థిక వ్యవస్థలో దీన్ని పాత్ర ఎంతో కీలకం. దేశంలో నిత్యం దాదాపు 20 వేల రైళ్ల కార్యకలాపాలు జరిగేందుకు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దేశంలోని అన్ని రైల్వేల్లో కవచ్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 3 వేల కిలోమీటర్ల పొడవున కవచ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 2024లో కవచ్ వెర్షన్ 4.0కి ఆమోదం లభించింది'' అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ''వందే భారత్లో స్లీపర్ రైళ్లను అభివృద్ధి చేస్తోంది. తొలి రైలు ట్రయల్లో ఉంది. వందేభారత్, అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందించనున్నాయి'' అని తెలిపారు. ''గత యూపీఐ హయాంలో రైల్వే వ్యవస్థ దారుణంగా ఉండేది. రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుత సర్కార్ దీనిపై దృష్టి సారించింది. అయితే.. కాంగ్రెస్ రైల్వే ప్రయాణాలపై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని అదునుగా తీసుకొని భయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు హస్తం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవు'' అని పేర్కొన్నారు.
Comments
Post a Comment