కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు...!


దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య 30 వేల లోపుగానే ఉంటోంది. కరోనా మునుపటి స్థితి దేశంలో నెలకొంటోంది. ప్రజలు కూడా తమ దినచర్యలో మునిగిపోతున్నారు. అయితే తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారి కంటే కొత్త కేసులు ఎక్కువ నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే 6 నుంచి 8 వారాలపాటు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ కాలం అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి పూర్తిగా పోలేదని, ప్రజలు రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. కొవిడ్‌ విషయంలో ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులున్నాయని, రోజురోజుకీ వైరస్‌ తిరోగమనంలో సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు. పండగల సీజన్‌ మళ్లీ కేసులను పెంచే పరిస్థితి రాకూడదంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు, గుంపులుగా చేరడం మానుకోవాలన్నారు. కాగా దేశవ్యాప్తంగా తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువన నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. 24 గంటల వ్యవధిలో దాదాపు 16 లక్షలమందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 29 వేల 616 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందు రోజుతో పోల్చితే కేసులు 5 శాతం మేర తగ్గాయి. కేరళలో అత్యధికంగా 17వేల 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 71 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తంగా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 85 కోట్లకు చేరింది.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం