భార్య, కోడలు, మనవరాలిని సుత్తితో కొట్టి చంపిన వృద్ధుడు
ఒ డిశాలోని దేవ్గఢ్ జిల్లా గరియాపాలి గ్రామంలో గృహ వివాదాల నేపథ్యంలో రమేష్ అనే వృద్ధుడు తన భార్య, కోడలు, మనవరాలిని సుత్తితో కొట్టి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు కుటుంబ సభ్యులతో గొడవపడి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి తన తల్లి, భార్య, కూతురు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న కుంధెయిగోల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్య అనంతరం నిందితుడు గ్రామం విడిచి పరారవ్వగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రశాంతంగా ఉండే గరియాపాలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.