వరుసగా ఐదో రోజు కూడా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
వ రుసగా ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 604.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 193.55 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 604 పాయింట్ల నష్టంతో 83,576.24 వద్ద, నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 25,683.30 వద్ద ముగిసింది. ఈ వారంలో మొత్తంగా స్టాక్ మార్కెట్లు 2,600 పాయింట్లు నష్టపోయాయి. గడిచిన ఐదు సెషన్లలో మొత్తం 2 శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల అంశాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, గ్లోబల్ పాలిటిక్స్ వంటివి భారీ నష్టాలకు కారణమయ్యాయి. రియాల్టీ, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటివి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భారతీయ మార్కెట్లపై ట్రంప్ నిర్ణయాలు ప్రభావం చూపుతున్నాయి. ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్ లపై నేడు అక్కడి కోర్టు తీర్పు వెలువరించనుంది. ట్రంప్ కు అనుకూలంగా తీర్పు వస్తే అంతర్జాతీయ మార్కెట్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మార్కెట్లకు ఊరట లభిస్తుంది.