సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీకొని ముగ్గురు కూలీలు దుర్మరణం
తె లంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న క్రమంలో ఒక సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డీసీఎం వ్యాన్ నేరుగా వెళ్లి ట్యాంకర్ను ఢీకొనడంతో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో వాహనాల వేగమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.