మేక మాంసంలో బర్రె దూడ మాంసం కల్తీ : ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైన వాస్తవాలు : నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు
హై దరాబాద్ లోని హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బడే మసీదు వద్ద మహ్మద్ ఉస్మాన్ ఖురేషి దుకాణంపై ఈ నెల 1న హెచ్- ఫాస్ట్ ఎస్సై నవీన్, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, హబీబ్నగర్ ఎస్సై అశోక్, సీసీఎస్ పోలీసులు దాడులు జరిపారు. దుకాణంలోని 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని చెంగిచర్లలోని నేషనల్ మీట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఎన్ఎంఆర్ఐ) ల్యాబ్కు తరలించి డీఎన్ఏ పరీక్షలు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మేక మాంసంలో బర్రె దూడ మాంసం కలిపినట్లుగా నిర్ధారించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు. మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కల్తీ కేటుగాళ్లు ఎక్కువగా బర్రె దూడలనే ఎంచుకుని మేక, గొర్రె మాంసంలో కలుపుతూ విక్రయిస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. మేక, గొర్రె మాంసంలో కల్తీ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్- ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు.