సౌదీ అరేబియాను ముంచెత్తిన వరదలు : జనజీవనం అతలాకుతలం
సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుపానుల బీభత్సానికి రాజధాని రియాద్తో పాటు పలు కీలక ప్రావిన్సుల్లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్లో ఉంచింది. రాజధాని రియాద్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుపానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్-అహసా ప్రావిన్సులో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్ధమైంది. రియాద్లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. వారికోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.