Ad Code

అస్సాంలో తీవ్ర విషాదాన్ని నింపుతున్న వరదలు : 78కి చేరిన మరణాలు, కొట్టుకుయాయిన 11 వేల పశువులు

స్సాంలో వరదలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటికీ 3 లక్షల మందికి పైగా ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, బిశ్వనాథ్ , కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 21 రెవెన్యూ సర్కిళ్లు, 551 గ్రామాలు నీట మునిగాయి. సుమారు 21,523 హెక్టార్ల పంట పొలాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధిత జిల్లాల్లో చరైడియో అత్యంత తీవ్రంగా దెబ్బతింది, ఇక్కడ ఒక్క జిల్లాలోనే 1.37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (84,600 మంది), జోర్హాట్ (49,911 మంది) ఉన్నాయి. మంగళవారంతో పోలిస్తే బాధితుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. వరద బాధితుల కోసం ప్రభుత్వం భారీగా సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 71 పునరావాస కేంద్రాలలో 16,500 మందికి పైగా వసతి పొందుతుండగా, మరో 72,000 మందికి 30 సహాయ పంపిణీ కేంద్రాల ద్వారా ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారు. మెడికల్, వెటర్నరీ టీమ్‌లతో పాటు వివిధ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక ఈ వరదల ధాటికి రహదారులు, ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమవ్వడమే కాకుండా, 11,000 కంటే ఎక్కువ పశువులు కొట్టుకుపోయాయి.

Post a Comment

0 Comments

Close Menu