వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్ ఫైర్ : ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉ త్తరప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయంలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ముంబై వెళ్లేందుకు తన భార్యతో కలిసి ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన వద్ద ఉన్న ఆయుధాన్ని డిక్లేర్ చేశారు. ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆయుధాన్ని తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా మిస్ ఫైర్ అయింది. ఈ మిస్ఫైరింగ్ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న ఏఏఐసీఎల్ఏఎస్ భద్రతా తనిఖీ సిబ్బంది ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని విమానాశ్రయ డైరెక్టర్ వెల్లడించారు. బుల్లెట్ గాయాలైన ఇద్దరు సిబ్బందిని తక్షణమే సమీపంలోని న్యూ లక్ష్మి ట్రామా సెంటర్కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన, కాల్పులు జరగడానికి గల ఖచ్చితమైన కారణాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో ఎయిర్పోర్టు ప్రాంగణంలో కాసేపు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.