ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ !
జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.