Ad Code

గుంతకల్లు-బళ్లారి రైల్వే 3, 4వ లైన్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ

గుంతకల్లు-బళ్లారి రైల్వే మార్గంలో 3, 4వ లైన్ల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన భేటీలో ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని మూడు జిల్లాల పరిధిలోని సుమారు 46 కిలోమీటర్ల మేర సాగనుంది. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు. ఈ విస్తరణ ద్వారా దాదాపు 99 గ్రామాలకు మెరుగైన రైలు రవాణా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, బళ్లారి కోట, శ్రీ కుమార స్వామి దేవాలయం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. గుంతకల్లు-బళ్లారి సెక్షన్ గుండా ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా భారీగా జరుగుతుంటుంది. అదనపు లైన్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఏటా మరో 16.22 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసే వెసులుబాటు కలుగుతుంది. ట్రాక్‌లపై రద్దీ తగ్గి సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్లు సమయానికి చేరుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఇంధన వినియోగం తగ్గి, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. ప్రతి ఏటా దాదాపు 1.32 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు, 6.67 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది సుమారు 27 లక్షల మొక్కలు నాటడంతో సమానమని పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమై, స్థానికులకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu