రూ.20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ.20,804 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది  అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న రైల్వే ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అత్యధిక రద్దీ ఉండే కారిడార్లలో కొత్త రైలు మార్గాలు, త్రిబుల్, క్వాడ్రపుల్ (నాలుగు) ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా రంగంలో ఊహించని వేగం పుంజుకోనుంది. ఈ కేబినెట్ నిర్ణయంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు పెద్దపీట వేశారు. దక్షిణాది కోసం దాదాపు రూ.10,021 కోట్లతో 5 ముఖ్యమైన ప్రాజెక్టులను ఖరారు చేశారు. దీని ద్వారా దాదాపు 540 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. 17 జిల్లాల్లోని 2,121 గ్రామాలకు చెందిన 52 లక్షల మంది ప్రజలకు ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చనుంది. మరో వైపు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రూ.10,783 కోట్ల అంచనా వ్యయంతో 3 భారీ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. ఇవి ఖరగ్‌పూర్ - ఝార్సుగూడ (బగ్దేహి) 4వ లైన్, కట్నీ - పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్‌పూర్ - పెండ్రా రోడ్ 3వ లైన్‌లను కవర్ చేస్తాయి. మొత్తం 14 జిల్లాల్లో విస్తరించి ఉన్న 656 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4,790 గ్రామాలు, 56 లక్షల జనాభాకు ఆధునిక రైల్వే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం