కర్ణాటకలోని బాగ్కోట్ జిల్లాలో భార్యపై వివాహేతర సంబంధం మోపిన భర్త.. ఆమెను అనుమానంతో ఉరితీసి పొట్టనబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రాణాలు పోతున్న సమయంలో వీడియో రికార్డ్ చేసి, బాధితురాలి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మరీ ఆ దృశ్యాలను చూపించిన కర్కశ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాగ్కోట్ జిల్లా గలగలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగలూర్, భాగ్యశ్రీ (23) దంపతులు. గతంలో గొడవలు జరగడంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇకపై గొడవపడకుండా కాపురం చేద్దామని నమ్మించి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి రప్పించాడు. కానీ ఇంటికి వచ్చిన రోజే ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ తన భార్యపై కర్రతో దాడి చేసి, అనంతరం గ్రీన్ దుపట్టాతో ఉరి వేశాడు. ఆమె ప్రాణాల కోసం గింజుకుంటున్న సమయంలో ఆ దృశ్యాలను తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. అంతేకాకుండా భాగ్యశ్రీ తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో కాల్ చేసి కూతురు చనిపోవడాన్ని ప్రత్యక్షంగా చూపించాడు. ఆ వీడియోను తన స్నేహితులు, బంధువులకు కూడా షేర్ చేశాడు. మంచంపై ఆమె ఉరివేలాడుతున్న సమయంలో గోడపై వారి పెళ్లి నాటి పేర్లు రాసి ఉన్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. సమాచారం అందుకున్న బిలగి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు ప్రవీణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
భార్యను వివాహేతర సంబంధం అనుమానంతో ఉరితీసిన భర్త
July 28, 2026
0
Tags