ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీ సీనియర్ నేత , పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోని అన్ని బాధ్యతలకూ గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు సాయి ప్రసాద్ వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇన్నాళ్లూ పార్టీలో తనకు సహకరించి, మద్దతుగా నిలిచిన నాయకులకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరించిన సాయి ప్రసాద్ రాజీనామా చేయడం పెద్దాపురం స్థానిక రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం తగ్గుతుండగా, సాయి ప్రసాద్ వంటి కీలక నేత నిష్క్రమణ ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు పడనున్నాయనే దానిపై స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయన బాటలోనే మరికొందరు కౌన్సిలర్లు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైఎస్ఆర్సీపీని వీడటానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా
September 08, 2026
0
Tags