ఆన్లైన్ మోసాల బారిన పడి డబ్బు కోల్పోయిన కస్టమర్లను ఆదుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.బాధితులకు నేరుగా పరిహారం అందించే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో జరిగిన మోసాల విలువ దాదాపు రూ. 36,014 కోట్లకు చేరడం గమనార్హం. ఈ భారీ దోపిడీని అరికట్టడంతో పాటు, బాధితులకు భరోసా కల్పించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఎవరైనా బాధితుడు రూ. 29,412 లోపు నగదు కోల్పోతే, అందులో 85 శాతం పరిహారంగా అందుతుంది. ఒకవేళ మోసం విలువ రూ. 50,000 వరకు ఉన్నా సరే, బాధితులకు గరిష్టంగా రూ. 25,000 వరకు పరిహారం అందించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ పరిహారంలో 65 శాతం మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ భరిస్తుండగా, మిగిలిన మొత్తంలో తలో 10 శాతాన్ని సంబంధిత బ్యాంకులు భరిస్తాయి. కేవలం పరిహారం ఇవ్వడమే కాకుండా, అసలు మోసాలకు అడ్డాగా మారుతున్న 'మ్యూల్' ఖాతాలను వేటాడేందుకు ఆర్బీఐ అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. అనుమానాస్పద లావాదేవీలను, నకిలీ బ్యాంక్ ఖాతాలను గుర్తించేందుకు 'MuleHunter.AI' అనే కృత్రిమ మేధస్సు సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. ఇది నిరంతరం బ్యాంకింగ్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తూ, నేరగాళ్లు డబ్బును చేరవేసే మార్గాలను ఇట్టే పసిగట్టేస్తుంది. నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించడం, మరోవైపు ఏఐ టెక్నాలజీతో నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించడం అనే ఈ రెండు వ్యూహాలు డిజిటల్ చెల్లింపులపై సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు, మోసం జరిగిన వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఈ పరిహారం పొందే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆన్లైన్ మోసాల బాధితులకు ఆర్బీఐ భారీ ఊరట : ముసాయిదా మార్గదర్శకాలను విడుదల
April 16, 2026
0
Tags