మీ తప్పులు, దయ వల్ల కాదు, మా శక్తిసామర్థ్యాలతో ఎదుగుతాం

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరుగుతున్న రైసినా డైలాగ్ 2026లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతి పథాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ముఖ్యంగా అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి క్రిస్టఫర్ లాన్‌డౌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జైశంకర్ పదునైన విమర్శలు గుప్పించారు. మీ తప్పులు, దయ వల్ల కాదు, మా శక్తిసామర్థ్యాలతో ఎదుగుతాం అని ఘాటుగా బదులిచ్చారు. రెండు రోజుల క్రితం ఇదే కార్యక్రమంలో క్రిస్టోఫర్ లాన్‌డౌ మాట్లాడుతూ.. "గతంలో అమెరికా చేసిన సహాయం వల్లే చైనా మాకు ప్రధాన పోటీదారుగా ఎదిగింది. భారత్ విషయంలో అలాంటి పొరపాటును పునరావృతం కానివ్వం. భారత్‌కు చైనా తరహా ఆర్థిక ప్రయోజనాలు సమకూరనివ్వం" అని వ్యాఖ్యానించారు. అంటే భారత్ మరో చైనాలా ఎదగకుండా అడ్డుకుంటామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. లాన్‌డౌ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ.. "భారత్ వృద్ధి అనేది ఇతరుల తప్పిదాలపై ఆధారపడి లేదు. మా పురోగమనాన్ని మేమే నిర్దేశించుకున్నాం. సవాళ్లు ఎదురైనా మా ప్రయాణం ఆగదు" అని గర్వంగా ప్రకటించారు. తమతో కలిసి పనిచేసే వారు అధిక ప్రయోజనం పొందుతారని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని చాటుకుంటుందని ఆయన వివరించారు. 'భారత్ ఎదుగుదలను భారతదేశమే నిర్ణయిస్తుంది. అలాగే ఇరాన్ యుద్ధ నౌక 'ఐరిస్ లావన్'కు కొచ్చిన్‌లో ఆశ్రయమివ్వడంపై నెలకొన్న వివాదానికి జైశంకర్ తెరదించారు. విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2026 వేడుకలకు వచ్చిన ఇరాన్ నౌకలు, ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తినప్పుడు మానవతా దృక్పథంతో 183 మంది సిబ్బందికి ఆశ్రయం ఇచ్చామని.. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత్ సరైన నిర్ణయమే తీసుకుందని ఆయన సమర్థించుకున్నారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్ఎన్ఎస్ దేనా నౌకను శ్రీలంక తీరంలో అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచం ఇకపై ఏ ఒక్క దేశం అజమాయిషీలో ఉండదని, అది 'బహుళ ధ్రువ' వ్యవస్థగా మారుతుందని జైశంకర్ విశ్లేషించారు. పెద్ద దేశాలే విధివిధానాలు నిర్ణయించే రోజులు పోయాయని, అన్ని దేశాల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. బహుళ ధ్రువ వ్యవస్థ అనేది ప్రపంచ శాంతికి, అభివృద్ధికి కీలకమని ఆయన ఉద్ఘాటించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default