ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేదుకు అమెరికా యత్నాలు : జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను మధ్యప్రాచ్యం వైపు తరలింపు

Telugu Lo Computer
0


ప్రపంచంలో అతి పెద్ద విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను అమెరికా కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యం వైపు తరలిస్తోంది. ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరాన్‌తో అణు కార్యక్రమంపై చర్చలు విఫలమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి రాకపోతే దాడులకు దిగేందుకైనా సిద్ధమేనని అమెరికా సంకేతాలిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక సమూహం మోహరించి ఉంది. ఇప్పుడు జెరాల్డ్ ఫోర్డ్ కూడా చేరనుండటంతో ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన విమాన వాహక నౌకలు అందుబాటులో ఉంటాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం కరేబియన్‌లో ఉన్న జెరాల్డ్ ఫోర్డ్ స్ట్రైక్ గ్రూప్ అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం మీదుగా పర్షియన్ గల్ఫ్ వైపు పయనిస్తోంది. ఈ నౌకతో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీ వంటి అత్యాధునిక డిస్ట్రాయర్లు కూడా ఈ బృందంలో ఉన్నాయి. ఈ విమానవాహక నౌక మే నెల ఆరంభం వరకు మధ్యప్రాచ్యంలోనే ఉండే అవకాశం ఉందని, దీంతో దీని మోహరింపు కాలం 10 నెలలకు పొడిగించవచ్చని తెలుస్తోంది. గతంలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించేందుకు అమెరికా చేపట్టిన సైనిక చర్యలో జెరాల్డ్ ఫోర్డ్ నుంచే యుద్ధ విమానాలు పాల్గొన్నాయని నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకే అమెరికా ఈ చర్య తీసుకుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default