అంబటి రాంబాబు విడుదల

Telugu Lo Computer
0


సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. విడుదల వార్త బయటకు రాగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్నారు. పూలమాలలు, నినాదాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను విడుదల కాకుండా చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యవహరించారని ఆరోపించారు. తనపై నమోదైన కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపే కారణమని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని చెప్పారు. బాధితుడిని జైలులో ఉంచి, నిజమైన నిందితులను బయట ఉంచిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయానికి దేవుడే తీర్పు చెబుతాడని వ్యాఖ్యానించారు. న్యాయం ఆలస్యమైనా తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దాడిని ఖండించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. అంబటి రాంబాబు పై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు కూడా వాటిలో ఒకటి. గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై మరో కేసు నమోదు అయింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మరో కేసు పెట్టారు. ఈ కేసుల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం కోర్టు విచారణలో ఒక్కొక్కటిగా బెయిల్ మంజూరు కావడంతో విడుదలకు మార్గం సుగమమైంది. తాజా పరిణామంతో సంక్రాంతి లక్కీ డ్రా కేసులో కూడా బెయిల్ లభించడంతో ఆయన జైలు జీవితం నుంచి బయటపడ్డారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default