అమెరికా లోని న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ xAI సంస్థపై దావా వేసింది. ఆష్లీ సెయింట్ క్లెయిర్ తన పిటిషన్లో గ్రోక్ ఏఐ పనితీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులు ఇచ్చే కొన్ని ప్రాంప్ట్ల ఆధారంగా, గ్రోక్ తన అనుమతి లేకుండానే తనను అత్యంత అశ్లీలంగా, అసభ్యకరంగా చూపించే డీప్ఫేక్ చిత్రాలను సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ చిత్రాలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను , గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె కోర్టుకు విన్నవించారు. గతంలోనే ఈ విషయాన్ని xAI సంస్థ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు తాత్కాలికంగా అడ్డుకుంటామని చెప్పి మళ్లీ అదే తరహా కంటెంట్ను అనుమతిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తనను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న అసభ్యకర చిత్రాలను వెంటనే నిలిపివేయాలని , తనకు జరిగిన మానసిక వేదనకు, ప్రతిష్ఠా భంగానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రోక్ ఏఐ ద్వారా కేవలం ఆష్లీ మాత్రమే కాకుండా, అనేక మంది మహిళలు , మైనర్ పిల్లల ఫోటోలను ఉపయోగించి అశ్లీల చిత్రాలు రూపొందుతున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇతర ఏఐ సంస్థలైన ఓపెన్ ఏఐ లేదా గూగుల్ వంటివి ఇలాంటి సున్నితమైన అంశాలపై కఠినమైన ఫిల్టర్లను కలిగి ఉన్నాయి. కానీ, మస్క్ గ్రోక్ విషయంలో ‘అపరిమిత స్వేచ్ఛ’ను ఇస్తానని ప్రకటించడం, ఇప్పుడు డీప్ఫేక్ నేరగాళ్లకు వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా, వ్యక్తిగత గోప్యతకు గొడ్డలిపెట్టుగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆష్లీ సెయింట్ క్లెయిర్ , ఎలోన్ మస్క్ మధ్య వివాదం ఈ డీప్ఫేక్ చిత్రాలకే పరిమితం కాలేదు. గతంలోనే ఆమె మస్క్ వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎలోన్ మస్క్తో తనకు సంబంధం ఉందని, తమకు ఒక కుమారుడు కూడా ఉన్నాడని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచేందుకు మస్క్ తనకు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 125 కోట్లు) ఆఫర్ చేశారని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. పాత వ్యక్తిగత వివాదాల నేపథ్యంలోనే ఇప్పుడు న్యాయపోరాటం మొదలవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
xAI సంస్థపై ఆష్లీ సెయింట్ క్లెయిర్ దావా
January 16, 2026
0
Tags