తన వీర్యాన్ని ఉపయోగించి పిల్లలను కనాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స చేయిస్తానని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రకటించారు. అంతేకాకుండా తన వీర్యం ద్వారా పుట్టిన పిల్లలందరికీ తన 17 బిలియన్ డాలర్ల ఆస్తిలో సమాన వాటా ఇస్తానని వాగ్దానం చేశారు. 41 ఏళ్ల పావెల్ దురోవ్ తన వీర్య దానం ద్వారా ఇప్పటికే వంద మందికి పైగా జీవసంబంధిత పిల్లలకు తండ్రి అయ్యారు. వీరితో పాటు ముగ్గురు భాగస్వాముల ద్వారా ఆయనకు మరో ఆరుగురు పిల్లలు ఉన్నారు. తన ఆస్తి పంపకంపై ఆయన కొన్ని షరతులు విధించారు. వారసత్వం కావాలనుకునే వారు తమకు పావెల్ దురోవ్తో జన్యుపరమైన సంబంధం ఉందని నిరూపించుకోవాలి. దురోవ్ మరణించిన 30 ఏళ్ల తర్వాతే ఆ పిల్లలకు ఆస్తిలో వాటా లభిస్తుంది. తన సొంత పిల్లలకు, వీర్య దానం ద్వారా పుట్టిన పిల్లలకు మధ్య తను ఎలాంటి తేడా చూపనని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పురుషులలో వీర్య కణాల నాణ్యత పడిపోతోందని పావెల్ దురోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన వీర్యం కొరతను తీర్చడం, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి సహాయపడటం తన బాధ్యత అని ఆయన భావిస్తున్నారు. 2010లో ఒక స్నేహితుడికి సహాయం చేయడం కోసం ఆయన మొదటిసారి వీర్య దానం ప్రారంభించారు. పావెల్ దురోవ్ వీర్యం ప్రస్తుతం మాస్కోలోని 'అల్ట్రావిటా క్లినిక్'లో భద్రపరచబడి ఉంది. అయితే దీనిని పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. 37 ఏళ్ల లోపు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు కేవలం అవివాహిత మహిళలకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, పావెల్ దురోవ్ వీర్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. గత ఏడాది మాస్కో క్లినిక్లో ఆయన వీర్యాన్ని ఉచితంగా ఆఫర్ చేసినప్పుడు వందలాది మంది మహిళలు స్పందించారు. ఉన్నత విద్యావంతులు, ఆరోగ్యవంతులైన మహిళలు దురోవ్ వంటి మేధావి, విజయవంతమైన వ్యక్తిని తమ బిడ్డకు తండ్రిగా కోరుకుంటున్నారని క్లినిక్ వైద్యులు తెలిపారు.
నా వీర్యాన్ని ఉపయోగించి పిల్లలను కనాలనుకునే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స చేయిస్తా !
December 25, 2025
0
Tags