కనీస ప్రాథమిక వసతులు కల్పించకుండా మోడీ బిల్డర్స్ మోసం : బాధితుల ఆందోళన

Telugu Lo Computer
0

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న మోడీ బిల్డర్స్ చేపట్టిన ప్రతిష్టాత్మక సిల్వర్ ఓక్స్ ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారుల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని చర్లపల్లి/ ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో రూ. కోట్లు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన యజమానులు బిల్డర్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం కనీస ప్రాథమిక వసతులు కల్పించకుండా తమను మోసం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. బాధితులు లేవనెత్తుతున్న ప్రధాన ఫిర్యాదుల ప్రకారం.. ప్రాజెక్ట్ విక్రయ సమయాన బిల్డర్లు ఇచ్చిన అనేక హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు , క్లబ్‌హౌస్ వంటి కనీస మౌలిక వసతులను సమగ్రంగా అందుబాటులోకి తేలేదని నివాసితులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ నాణ్యతలో లోపాలు ఉండటమే కాకుండా, కొన్ని కీలకమైన అనుమతుల విషయంలోనూ బిల్డర్ యజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని, సమస్యలను పరిష్కరించాలని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విల్లా యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు, గడువు ముగిసినప్పటికీ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో హ్యాండోవర్ చేయకపోవడం, నిర్వహణ లోపాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. బిల్డర్ల నుంచి సరైన స్పందన రాకపోవడంతో విసుగు చెందిన యజమానులు ఏకమై ప్రాజెక్ట్ ప్రాంగణంలోనే నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రూ. కోట్ల విలువైన ఆస్తులను నమ్మి కొనుగోలు చేసిన తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం, అథారిటీలు తక్షణమే జోక్యం చేసుకుని మోడీ బిల్డర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, హామీ ఇచ్చిన వసతులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయించేలా ఉత్తర్వులు జారీ చేయాలని విల్లా యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default