పశ్చిమ ఆఫ్రికాలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాబందులు చనిపోయిన జంతువుల కళేబరాలను తినడంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పర్యావరణాన్ని కాపాడుతాయి. అలాంటి రాబందులు తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వ్యాధుల వ్యాప్తి ప్రమాదం కూడా పెరుగుతోందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే, సంప్రదాయ విశ్వాసాల పేరుతో వాటిని వేటాడటం, విషప్రయోగం చేయడం, వాటి నివాస ప్రాంతాలను ధ్వంసం చేయడం వంటి కారణాలతో పలు రాబందుల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయితే నైజీరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న అవ్కా-ఏటీటీ అనే చిన్న పట్టణం మాత్రం ఇందుకు భిన్నమైన ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు రాబందులను పవిత్ర పక్షులుగా భావిస్తూ వాటిని రక్షిస్తున్నారు. అవ్కా-ఏటీటీలో 'న్గుమా' అనే దేవతకు అంకితమైన ఓ పురాతన పుణ్యక్షేత్రం చుట్టూ పవిత్ర అడవి ఉంది. అక్కడ రాబందులు తరతరాలుగా సంచరిస్తున్నాయి. స్థానికుల సంప్రదాయ ఆచారాల్లో భాగంగా రాబందులకు ఆహారం లభిస్తుండటంతో అవి తరచూ ఆలయ పరిసరాలకు చేరుతుంటాయి. అలాగే, చుక్వుమెకా ఇగ్వే అనే స్థానికుడు రాబందుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషితో 'వల్చర్ కింగ్'గా పేరొందాడు. 'ఇక్కడి స్థానికులు రాబందులను వేటాడరు. నైవేద్యం సమర్పించిన తర్వాత రాబందులు కనిపిస్తే దేవత తమ ప్రార్థనను స్వీకరించినట్లుగా భావిస్తారు'' అని ఆయన చెబుతున్నారు. రాబందులను కేవలం కళేబరాలను తినే పక్షులుగా చూడటం తప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ప్రకృతికి అత్యంత కీలకమైన 'క్లీనింగ్ సర్వీస్' అందిస్తాయి. దీంతో చనిపోయిన జంతువుల కళేబరాలను కొన్ని గంటల్లోనే తినేయడం ద్వారా ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. వాటి జీర్ణాశయంలోని శక్తివంతమైన ఆమ్లాలు.. ఆంత్రాక్స్, రేబిస్ వంటి వ్యాధులతో చనిపోయిన జంతువులను కూడా జీర్ణించుకోగలుగుతాయి. రాబందుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిన ప్రాంతాల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు పెరిగినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయని నైజీరియా కన్జర్వేషన్ ఫౌండేషన్ జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బర్డ్లైఫ్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఆఫ్రికాలో గత 50 ఏళ్లలో రాబందుల సంఖ్య 80 నుంచి 97 శాతం వరకు పడిపోయింది. దీంతో ఆఫ్రికాలోని ఏడు రాబందుల జాతులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులుగా గుర్తించబడ్డాయి. విషప్రయోగం రాబందుల మరణాలకు ప్రధాన కారణంగా మారింది. సంప్రదాయ వైద్యం, ఆధ్యాత్మిక విశ్వాసాల పేరుతో రాబందులు, వాటి శరీర భాగాలకు డిమాండ్ పెరుగుతోంది. నైజీరియాలో గతంలో ఒక రాబందు ధర సుమారు 25 నుంచి 30 వేలు ఉండేది. ఇప్పుడు అదే పక్షి 2 లక్షల వరకు పలుకుతోందని పరిరక్షణ నిపుణులు చెబుతున్నారు.
పశ్చిమ ఆఫ్రికాలో రాబందులు కనుమరుగు : వ్యాధుల వ్యాప్తి ప్రమాదం : పర్యావరణ పరిరక్షణ నిపుణులు హెచ్చరిక
August 13, 2026
0
Tags