మార్కెట్‌లోకి జియో ట్యాగ్ 2 విడుదల

Telugu Lo Computer
0

మార్కెట్‌లోకి జియో ట్యాగ్ 2 పేరుతో కొత్త డివైజ్ ను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో జియో తీసుకొచ్చిన జియో ట్యాగ్ డివైజ్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ కొత్త వెర్షన్‌లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఈసారి జియో ట్యాగ్ 2ను ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు రకాల ఫోన్లతోనూ ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ఈ గ్యాడ్జెట్‌లో వచ్చిన అతిపెద్ద మార్పు. జియో ట్యాగ్ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. ఇది మూడు (బ్లాక్, రెడ్, గ్రీన్) రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని డిజైన్ కూడా కొంత మార్చేశారు. పాత వెర్షన్‌తో పోలిస్తే ఇది.. కొత్త ఆకారంలో కనిపిస్తుంది. ప్రస్తుతం దీన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.50 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీంతో ధర రూ.1,199కి చేరుతుంది. జియో ట్యాగ్ 2లో వచ్చిన అతిపెద్ద అప్‌గ్రేడ్ క్రాస్ ప్లాట్‌ఫామ్ సపోర్ట్. అంటే ఇంతకుముందు కొన్ని పరిమితులు ఉండగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు రెండింటిలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ చిన్న డివైజ్‌ను బ్యాగులు, కీలు, పర్సులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులకు అమర్చుకోవచ్చు. బ్లూటూత్ సహాయంతో సమీపంలో ఉన్న వస్తువులను సులభంగా గుర్తించవచ్చు. ఇందులో 120dB శబ్దం చేసే బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంటుంది. వస్తువు దగ్గరలో ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేసి దాన్ని త్వరగా కనుగొనవచ్చు. ఒకవేళ వస్తువు బ్లూటూత్ పరిధిని దాటిపోయినా.. లొకేషన్ ట్రాకింగ్ కోసం నెట్‌వర్క్ ఆధారిత సేవలను ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ ఫైండ్ హబ్, యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో వస్తువు ఉన్న ప్రదేశాన్ని మ్యాప్‌లో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిస్థాయి లైవ్ ట్రాకింగ్ కాకపోయినా వస్తువు చివరిగా ఎక్కడ కనిపించిందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default