తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నాదర్గుల్ ప్రాంతంలోని రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారని, పేదల ఇళ్లు కూలగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నాదర్గుల్లో జరుగుతున్న ఈ వేల కోట్ల కుంభకోణం, కబ్జాలు, చెరువుల ఆక్రమణలు ఎందుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ భారీ కుంభకోణం వెనుక సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం హస్తం ఉందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సైతం పక్కనపెట్టి, అధికార బలంతో బౌన్సర్లను పెట్టి పేద రైతులపై దాడులు చేయిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కబ్జాదారులను అరెస్ట్ చేయించి, తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులను తిరిగి భూముల్లోకి పంపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ భూ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేపటిలోగా చర్యలు తీసుకోకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో కలిసి తామే స్వయంగా నాదర్గుల్ భూముల వద్దకు వెళ్తామని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రౌడీలు, బౌన్సర్లు ఎప్పుడూ ఇలా పేదలపై పడలేదని, కాంగ్రెస్ రాగానే పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన విమర్శించారు.
నాదర్గుల్ ప్రాంతంలో రూ.7 వేల కోట్ల భూ స్కామ్ : రైతులను తిరిగి భూముల్లోకి పంపాలి
April 05, 2026
0
Tags