పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్ లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 26న వాంగ్చుక్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఆయన అప్పట్నించి జోధ్పూర్ జైలులో ఉంటున్నారు. హింసాత్మక ఘటనల అనంతరం శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను నిర్బంధంలోకి తీసుసుకున్నట్టు దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. లడఖ్ లో శాంతియుత వాతావరణం, సుస్థిరత, పరస్వర విశ్వాసాన్ని పాదుకొలిపేందుకు, భాగస్వామ్య పక్షాలతో అర్ధవంతమైన చర్చలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ లక్ష్య సాధన కోసం తగిన పరిశీలన అనంతరం జాతీయ భద్రతా చట్టం కింద తమకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకుని వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. లడఖ్ ప్రజల ఆకాంక్షలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని భాగస్వామ్య పక్షాలు, కమ్యూనిటీ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. లేహ్లో గత ఏడాది సెప్టెంబర్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. లడఖ్ ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లోకి చేర్చాలని, రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లతో చేపట్టిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు చనిపోగా, సుమారు 90 మంది గాయపడ్డారు. హింసను ప్రేరేపించారంటూ వాంగ్చుక్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వీలైతే ఆయన నిర్బంధాన్ని సమీక్షించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది.
సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేసిన కేంద్రం ప్రభుత్వం
March 14, 2026
0
Tags