వినూత్న రీతిలో మోసాలకు పాల్పడిన 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

Telugu Lo Computer
0


మెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం వినూత్న రీతిలో మోసాలకు పాల్పడిన 11 మంది భారతీయ పౌరులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒక పథకం ప్రకారం నకిలీ సాయుధ దోపిడీలను సృష్టించి, తాము నేర బాధితులమని చిత్రీకరించుకోవడం ద్వారా అమెరికా వీసాలు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వీసా మోసం కోసం కుట్ర పన్నారన్న అభియోగంపై వీరిపై ఫెడరల్ కోర్టులో కేసులు నమోదయ్యాయి. అమెరికా నిబంధనల ప్రకారం, ఏదైనా తీవ్రమైన నేరం జరిగినప్పుడు దానికి గురైన బాధితులు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తే వారికి 'యూ-వీసా' జారీ చేస్తారు. ఈ వీసా పొందితే అమెరికాలో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితులు.. కన్వీనియన్స్ స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు మరియు రెస్టారెంట్లలో నకిలీ దోపిడీల నాటకానికి తెరలేపారు. ఇలా మొత్తం ఆరు చోట్ల కృత్రిమంగా నేరాలు సృష్టించినట్లు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ఈ మోసపూరిత పథకం ప్రకారం ఒక వ్యక్తి దొంగలా నటించి దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్తాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యేలా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత బాధితులుగా నటించే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి, యూ-వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ నాటకంలో పాల్గొనేందుకు కొందరు వ్యక్తులు నిర్వాహకులకు భారీగా నగదు చెల్లించినట్లు, ఆ మొత్తాన్ని దుకాణ యజమానులకు వాటాలుగా పంచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం మసాచుసెట్స్‌, కెంటకీ, మిస్సౌరీ, ఒహైయో రాష్ట్రాల్లో అరెస్టులు జరిగాయి. నిందితులపై నేరం రుజువైతే గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్ల (సుమారు ₹2.29 కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default