ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడువు ముగిసిపోతున్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం గడువు పొడిగింపునిచ్చి భారీ ఊరటను ఇస్తోంది. ఈ క్రమంలోనే జల్ జీవన్ మిషన్ అమలుకు కేంద్రం గడువును పొడిగించింది. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పడకేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం గత 18 నెలలుగా కష్టపడుతోంది. కేంద్రం ఈ పథకానికి 27 వేల కోట్ల రూపాయల పనులకు అనుమతులు ఇచ్చినా, గత ఏళ్లలో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో సమకూర్చుకోకపోగా, నిధుల లభ్యత లేకపోవడంతో జల్ జీవన్ మిషన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల నుండి అన్ని కాలాలలోనూ తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని సుమారు 84 వేల ఐదు వందల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపింది. 2024- 2025 సంవత్సరంలోనే ముగిసిపోయిన ఈ పథకం గడువును పొడిగించాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం 2028 వరకు పథకం గడువును పొడిగించి ఆరి ఊరటను ఇచ్చింది. ఈ గడువు పెంపు వల్ల రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం ఏపీకి లభించింది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి కూడా రాష్ట్రానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం గడువు పొడిగింపుతో 27 వేల కోట్ల రూపాయల తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది.
జల్ జీవన్ మిషన్ అమలుకు కేంద్రం గడువు పొడిగింపు !
February 02, 2026
0
Tags