థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ - 2026 టోర్నీ లో భారత మహిళల జట్టు శ్రీలంకను ఓడించి ఫైనల్ కు వెళ్ళింది. తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది. లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ - 2026 టోర్నీ - ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు
February 20, 2026
0
Tags