టోల్ గేట్ల వద్ద బూస్టర్ లైన్ల విధానం

Telugu Lo Computer
0


సంక్రాంతి సమయంలో హైదరాబాద్ - విజయవాడ మధ్య వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ప్రతీ ఏటా టోల్ గేట్ల వద్ద భారీ వాహనాల రద్దీ.. నిరీక్షణ ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది. దీంతో ఈ సారి అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తం అయింది. కీలక నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బూస్టర్ లైన్ల విధానం అమలు చేయాలని డిసైడ్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా ఏర్పడనుంది. దీనిని నివారించేందుకు టోల్‌ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం శంషాబాద్, బొంగలూరు, పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ బూస్టర్ బారియర్ల వద్ద ఫాస్టాగ్ వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే నేరుగా వెళ్లిపోయేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం టోల్‌గేట్ల వద్ద రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాహనాలు ఆగకుండా త్వరగా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 12 నుంచి 15 టోల్ బూత్‌లు ఉండగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సరిపోవడం లేదు. దీంతో ఈ బూస్టర్ బారియర్స్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా సంక్రాంతి సమయంలో వాహనదారుల దగ్గర టోల్‌ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని కోరారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default