ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను తిప్పి కొట్టింది. తమ దేశ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకుంటే అది ఘర్షణలకు దారి తీస్తుందని, ఇరాన్ జాతీయ భద్రత రెడ్లైన్ లాంటిదని, దానిని దాటే ప్రయత్నం చేస్తే ఎక్కడ గురిపెట్టాలో తమకు తెలుసని, కాబట్టి అమెరికా అలా చేయకపోవడం ఉత్తమం'' అని ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ మరోవైపు ట్రంప్ బెదిరింపుల అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది. ఐరాసలో ఆ దేశ రాయబారి అమీర్ సయ్యద్ ఇర్వానీ ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. ట్రంప్ బెదిరింపులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఖండించిన ఇర్వానీ, అవసరమైతే తమ దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ మరో సీనియర్ నేత అలి లారిజానీ సంచలన ఆరోపణలకు దిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంలో నిరసనలను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. ఇరాన్లో విదేశీ జోక్యం జరిగితే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని సొంత ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారాయన. ఇరాన్లో నిరసనలు ఏడో రోజుకి చేరాయి. 2022లో మోరల్ పోలీసింగ్ ఘటనతో మరణించిన మహ్సా అమినికి సంఘీభావంగా మహిళా లోకం పెద్ద ఎత్తున ఉద్యమించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరాన్లో ఆ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి.
ట్రంప్ బెదిరింపులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన : అమీర్ సయ్యద్ ఇర్వానీ
January 03, 2026
0
Tags