డిసెంబర్ 6న దాడులకు 32 కార్లతో ఉగ్రవాదులు భారీ కుట్ర ?

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు కేవలం ఒక చిన్న సంఘటన కాదని, దీని వెనుక దేశ వ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్రణాళిక వేసినట్లు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. ఈ కుట్రలో వైట్‌కాలర్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. భారీ ఉగ్రదాడి చేసేందుకు పేలుడు పదార్థాలు నింపిన 32 కార్లను సిద్ధం చేసేందుకు అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 6న దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. అందుకోసమే ఈ 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ 32 కార్లతో ఢిల్లీతో సహా దేశంలోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడుల కోసం ఉపయోగించాలని అనుమానిత ఉగ్రవాదులు భావించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు దాడుల కోసం ఐ20, ఎకోస్పోర్ట్ వంటి కార్లను ఎంపిక చేసుకుని, వాటిని పేలుడు పదార్థాలను నింపేందుకు వీలుగా మాడిఫై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సీరియల్ పేలుళ్లకు పాల్పడాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని భద్రతా ఏజెన్సీల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడుల కోసం పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. ఇప్పటికే బ్రెజ్జా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్ కంపెనీలకు చెందిన కార్లను పోలీసులు గుర్తించారు. బ్రెజ్జా HR87 U 9988 అనే కారు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్‌లో కనుగొనబడింది. అలానే ఎకోస్పోర్ట్ DL10 CK 0458 నెంబర్ గల కారు బుధవారం రాత్రి హర్యానాలోని ఫరీదాబాద్‌లో కనుగొనబడింది. ఈ 32 కార్ల ద్వారా నాలుగు వేర్వేరు లొకేషన్లలో దాడులకు వినియోగించాలని మొత్తం ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులు ప్రణాళిక వేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల కోసం అవసరం అయ్యే పేలుడు పదార్థాల కొనుగోలుకు వైట్‌కాలర్ డాక్టర్లు నిధులు సమకూర్చారని పేర్కొన్నారు. నిందితులు సుమారు రూ. 26 లక్షల నిధిని సేకరించినట్లు సమాచారం. ఈ నిధులను పోగు చేసిన అనుమానితుల్లో డాక్టర్ ముజమ్మిల్ గన్నై, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షహీన్ సయ్యిద్, డాక్టర్ ఉమర్ నబీ ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ నిధులను ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రధానంగా డాక్టర్ ఉమర్ నబీ ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉన్నత విద్యావంతులు, వైట్‌కాలర్ ఉద్యోగులు ఉగ్ర కుట్రలో భాగం కావడాన్ని కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default