తెలంగాణలో స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసింది. సోమవారం హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై ఈ సందర్భంగా సీతక్క మండిపడ్డారు. అంతే కాకుండా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పొదుపు సొమ్మును సైతం గత ప్రభుత్వం కాజేసిందని విమర్శించారు. అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను కూడా ప్రభుత్వం మింగేసిందన్నారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. మహిళలకు నిధులను సమీకరించడమే కాదు, ఈ వడ్డీలను కూడా సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల కష్టాన్ని కాజేసి కన్నీళ్ళకు కారణమైన బీఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటూ ఆ పార్టీ నేతలకు సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ రుణాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని సీతక్క వివరించారు. ఈ సంఘాలకు క్రమం తప్పకుండా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా రూ. 304 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినాయి.
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాల విడుదల
November 24, 2025
0
Tags