నేషనల్ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా ప్రకారం దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. రెండవ స్ధానంలో రాజస్ధాన్ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్ అవినీతిలో టాప్లో ఉన్నాయి. ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం మినహా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
అవినీతిలో మహారాష్ట్ర టాప్ : ఈశాన్య రాష్ట్రాలు లాస్ట్
October 25, 2025
0
Tags