సీఎం స్టాలిన్‌ విమానానికి బాంబు బెదిరింపు !

Telugu Lo Computer
0


మెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు. ఈమెయిల్‌లో వచ్చిన ఈ బాంబు బెదిరింపు సమాచారం స్టాలిన్‌ వెళ్లే ఎమిరేట్స్‌ విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత విమానాశ్రయ అధికారులకు తెలిసింది. దీంతో విమానాశ్రయ అధికారులు విమానంలో ఉన్న ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులకు సమాచారం అందించారు. స్టాలిన్‌ ప్రయాణించిన విమానానికే కాకుండా చెన్నై విమానాశ్రయానికి కూడా ఈమెయిల్‌లో బాంబు బెదిరింపులు రావటంతో చెన్నై విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. అమెరికా పర్యటన కోసం స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్‌, అధికారులు మంగళవారం రాత్రి 8.40 గంటలకే మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. సీఎం అధికారిక పర్యటన ప్రకారం చెన్నై నుంచి ఎమిరేట్స్‌ విమానంలో దుబాయ్‌ వెళ్లి, అక్కడి నుండి మరో విమానంలో అమెరికా వెళ్ళాల్సి ఉంది. రాత్రి 10.16 గంటలకు బయలుదేరిన ఎమిరేట్స్‌ విమానంలో స్టాలిన్‌, సతీమణి, అధికారులు ప్రయాణించారు. ఆ విమానం బయలుదేరిన అరగంట తర్వాత బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలుసుకుని అధికారులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. మంగళవారం రాత్రి 7.55 గంటలకు సీఎం స్టాలిన్‌ మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్‌కు రాకముందే విమానాశ్రయ డైరెక్టర్‌కు స్టాలిన్‌ ప్రయాణించనున్న విమానంలో, విమానాశ్రయంలో బాంబులు పేలుతాయని గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్‌ చేశాడు. ఈ సందేశాన్ని రాత్రి 10 గంటల సమయంలోనే అధికారులు గుర్తించారు. అప్పటికే స్టాలిన్‌ ప్రయాణిస్తున్న ఎమిరేట్స్‌ విమానం చాలా దూరం వెళ్లింది. దీంతో ఆ విమానం దుబాయ్‌ చేరుకునేంత వరకూ విమానాశ్రయం ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. బుధవారం వేకువజాము దుబాయ్‌లో ఆ విమానం దిగిన తరువాత అక్కడి బాంబ్‌స్క్వాడ్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు లేవని నిర్ధారించారు. ఆ తర్వాతే అటు సీఎం సెక్యూరిటీ, ఇటు విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default