కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. రాబోయే ఏడు రోజుల్లోగా మంత్రి గద్దె దిగకపోతే, దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము నిర్వహించిన శాంతియుత ఆందోళన ఒక చారిత్రాత్మక ఘట్టమని అభిజీత్ దీప్కే అభివర్ణించారు. “సామాన్యులు (బొద్దింకలు) అంతా ఏకమైతే ఎలాంటి ప్రకంపనలు సృష్టించవచ్చో ప్రభుత్వానికి చూపించిన ఒక చిన్న ట్రైలర్ మాత్రమే ఇది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనలో పాల్గొన్న వారిలో అత్యధికులు మొదటిసారి రోడ్లపైకి వచ్చినవారే అయినప్పటికీ, విద్యావ్యవస్థపై ఉన్న నిరాశ, ఆక్రోశంతోనే ధైర్యంగా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో భాగస్వాములైన యువతకు, విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుత పోరాటమే తమ అతిపెద్ద ఆయుధమని, ఐక్యంగా సాగే ఉద్యమాలను ఏ శక్తీ అణచలేదని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ఒక పూర్తి తరానికి అన్యాయం చేశారని, ఈ పోరాటం ఇక్కడితో ఆగదని తేల్చిచెప్పారు. తదుపరి యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసేందుకు ఈరోజు ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా అనుచరులతో మాట్లాడనున్నట్లు దీప్కే వెల్లడించారు.
ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి : కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్
June 07, 2026
0
Tags