దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు ఈసీఎల్ జీఎస్ 5.0ను అమల్లోకి తెచ్చిన కేంద్రం

Telugu Lo Computer
0


దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు "ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0"ను కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీంతో పరిశ్రమలకు అదనపు క్రెడిట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీని ఇస్తుందని ఏపీ సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీలో సుమారు 20.77 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని, వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు (24%), సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు (48%), వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు (28%) ఉన్నాయని తెలిపారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 5.పథకంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి వస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) 100 శాతం, నాన్ ఎంఎస్ఎంఈ రంగాలకు 90 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని అందిస్తారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉపయోగించిన అత్యధిక వర్కింగ్ క్యాపిటల్‌లో 20% వరకు బ్యాంకుల ద్వారా పొందడానికి వీలుంది. ఈ పథకం కింద ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ.100 కోట్ల పరిమితి వరకు మాత్రమే అదనపు రుణం లభిస్తుంది. ఈ పథకం 31.03.2027 లోపు మంజూరై, 30 జూన్ 2027 నాటికి పంపిణీ చేసే రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో తమ రుణ ఖాతాలను సక్రమంగా చెల్లింపులు చేస్తున్న రుణగ్రహీతలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకాన్ని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ స్వయంగా నిర్వహించడమే కాకుండా పర్యవేక్షిస్తుంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ ప్రభావానికి గురైన ఎంఎస్ఎంఈలు ఈ సౌకర్యం ద్వారా రుణం పొంది తమ ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default