అస్సాంలో 'సంకల్ప పత్రం' పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల

Telugu Lo Computer
0


స్సాంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో 'సంకల్ప పత్రం' పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోలో మొత్తం 31 కీలక హామీలను ప్రకటించిన బీజేపీ, తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ₹5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఆరవ షెడ్యూల్‌లో చేర్చబడిన ప్రాంతాలు, అలాగే షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలు దీని నుంచి మినహాయిస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని.. అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో వరద సమస్యను పూర్తిగా నివారించేందుకు తొలి రెండు సంవత్సరాల్లో ₹18,000 కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని 'వరద రహిత అస్సాం'గా మార్చడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని బీజేపీ పదేళ్లలో సాధించిందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్‌కు స్పష్టమైన దృష్టి లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన అస్సాం యువత, ఇప్పుడు రాష్ట్రంలో పెరిగిన అవకాశాల కారణంగా తిరిగి వస్తున్నారని ఆమె అన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default