అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన ప్రకటనతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Telugu Lo Computer
0


రోజు దేశీయ స్టాక్ మార్కెటలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా 500 శాతం సుంకాల భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఉదయం భారీ నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టిన సూచీలు ఊహించని విధంగా యూటర్న్ తీసుకుని లాభాల్లోకి వచ్చేశాయి. సుమారు 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 25,500 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ మళ్లీ ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన ఒక్క ప్రకటన మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 'భారత్- అమెరికా కీలక భాగస్వాములు. మిత్రులన్నాక అభిప్రాయ భేదాలు ఉంటాయి. జనవరి 13వ తేదీన ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్యలు ఉంటాయి' అని ఆయన వెల్లడించారు. దీంతో దేశీయ మార్కెట్లకు బూస్ట్ ఇచ్చారు. దీంతో పాటుగా సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ప్యాక్స్ సిలికాన్ కూటమిలోకి భారత్‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అది మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంటును సృష్టించిందని చెప్పవచ్చు. దీంతో వరుసగా 5 రోజుల నష్టాల నుంచి మార్కెట్లు గట్టెక్కాయి. సెన్సెక్స్ గంట వ్యవధిలో 1100 పాయింట్ల మేర రికవరీ అయింది. సెన్సెక్స్ ఉదయం 83,435.31 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఇంట్రాడేలో 82,861 వద్ద కనిష్టాన్ని తాకింది. సెర్గియో గోర్ ప్రకటన చేసిన తర్వాత సూచీలు రయ్ రయ్ మంటు పరుగులు పెట్టాయి. ఇంట్రాడేలో 83,962 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. చివరికి 301.93 పాయింట్ల లాభంతో 83,878 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 సూచీ 25,473 వద్ద కనిష్ఠాన్ని తాకి ఇంట్రాడేలో 25,813 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 107 పాయింట్ల లాభంతో 25,790 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి షేర్లు లాభపడ్డాయి. ఇక ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్, బీఈఎల్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 63.02 డాలర్ల వద్ద ఉంది. బంగారం ఔన్స్ రేటు రికార్డ్ స్థాయిలో 4589 డాలర్లకు చేరుకుంది.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default