గోవా షిప్యార్డులో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో సముద్ర జలాల్లో కాలుష్యాన్ని నియంత్రించే అధునాతన సాంకేతికతతో దేశీయంగా తయారు చేసిన 'సముద్ర ప్రతాప్' నౌకను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. 114 మీటర్ల హైబ్రిడ్ పొల్యూషన్ కంట్రోల్ నౌకను ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గోవా షిప్యార్ట్ లిమిటెడ్ నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇందులో ఉంది. ఇందులో 60 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను వినియోగించారు. మారిటైం సవాళ్లను ఎదుర్కొనే రీతిలో సముద్ర ప్రతాప్ యుద్ధ నౌకను తయారు చేసినట్టు రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. మారిటైం పొల్యూషన్, ఫైర్ ఫైటింగ్, సముద్ర, పర్యావరణ రక్షణతోపాటు కోస్తా తీరప్రాంతాల్లో పెట్రోలింగ్ సైతం నిర్వహిస్తుందన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్న తరుణంలో మెరైన్ బయోడైవర్సిటీని పరిరక్షించడం మన నైతిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులో తయారు చేసే నౌకల్లో 90 శాతం స్వదేశీ సాంకేతికతను వాడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
సముద్ర జలాల్లో కాలుష్యాన్ని నియంత్రించే అధునాతన సాంకేతికత నౌక సముద్ర ప్రతాప్ జలప్రవేశం
January 05, 2026
0
Tags