తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి చేరాయి. ఆదిలాబాద్ 6.7, పటాన్‌చెరులో 8.4, మెదక్‌లో 8.8, రాజేంద్రనగర్‌లో 9.5, హనుమకొండలో 10.5, రామగుండంలో 11.5 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సమయంలో పొగమంచు  తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు రావడానికి జంకుతున్నారు. బట్టలు బాగా కప్పుకోవడం, వెచ్చని పానీయాలు తాగడం, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అవుతోంది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default